కాళేశ్వరం.. ధూం ధాం
13-06-2019 03:12:02
21న ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు
స్వయంగా బెజవాడ వెళ్లి జగన్కు సీఎం ఆహ్వానం
16న ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి సమావేశం
తెలంగాణలోని 80 శాతం ప్రాంతాలకు సాగు, తాగు నీటిని, పరిశ్రమలకు కావాల్సిన జలాలను అందించే జీవనాడి.. కేసీఆర్ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు.. రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేసే ఆధునిక దేవాలయం.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది! తెలంగాణలో.. ‘నీటి’ కలను సాకారం చేసే వరప్రదాయినిని ప్రారంభించే ముహూర్తం నిశ్చయమైంది!! ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి గోదావరి జలాలను ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోసే కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు!!
హైదరాబాద్/భూపాలపల్లి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించడానికి ముహూర్తం కుదిరింది. ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పినట్టు.. ముహూర్తబలం బాగుండడంతో ఈ నెల 21న ఆ ప్రాజెక్టును ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి పంప్హౌజ్ వద్ద ఈ మహత్తర ఘట్టానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఈమేరకు అధికారులు ఇప్పటికే ప్యాకేజీ 6, 7, 8 పనులన్నీ పూర్తిచేసి వెట్రన్, ట్రయల్ రన్లు విజయవంతంగా నిర్వహించారు. అయితే, కీలకమైన కన్నెపల్లి పంప్హౌజ్ వద్ద వెట్రన్ నిర్వహిందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ గోదావరిలో సరిపడా నీటిసామర్థ్యం లేకపోవడంతో వాయిదా వేస్తూ వస్తున్నారు. నైరుతి రుతుపవనాలు 15లోగా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండడం.. మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల ప్రాణహిత నది ద్వారా గోదావరిలోకి భారీగా వరద నీరు చేరే అవకాశం ఉండడంతో వెట్ రన్కు నీటి కొరత తీరే అవకాశం ఉంది. అయితే వెట్రన్, ట్రయల్రన్ అవసరం లేదని.. నేరుగా ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
అర కిలోమీటరు ఎత్తుకు..
మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్లను ఆరు దశల్లో లిఫ్టు చేసి.. 618 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మ సాగర్ వరకూ తరలించాలని నిర్ణయించారు. అంటే గోదావరి నది నీళ్లను అరకిలోమీటరుకు పైగా ఎత్తుకు లిఫ్టు చేయనున్నారు. ప్రాజెక్టులో ప్రధాన భాగమైన బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని మూడేళ్లలోనే పూర్తిచేశారు. రిజర్వాయర్ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. దీంతో తెలంగాణలో మొత్తం 199 కిలోమీటర్ల మేర గోదావరి నది సజీవంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
40 లక్షల ఎకరాలకు నీరు..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి నియోజకవర్గాల్లోని దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరందుతుంది. కాళేశ్వరం నీటి ద్వారానే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం చేపట్టారు. దీంతో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజమాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మరో 20 లక్షల ఎకరాలను స్థిరీకరించినట్టవుతుంది. అంటే తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు ఏటా రెండు పంటలకు నీరందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ విద్యుత్ సంస్థలు 139 మెగావాట్ల పంపులను వాడుతున్నాయి. భారతదేశంలో ఇంత భారీ సామర్థ్యంతో ఎవరూ పంపులు వాడలేదు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న సీఎంప్రారంభిస్తారనే అధికారిక సమాచారమేదీ లేదని ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు.
విద్యుత్ శాఖ చేసిన పనులు
పంపులు: 100
400 కేవీ సబ్ స్టేషన్లు: 6
220 కేవీ సబ్ స్టేషన్లు: 9
132 కేవీ సబ్ స్టేషన్లు: 2
400 కేవీ లైను పొడవు: 521.08 కిలోమీటర్లు
220 కేవీ లైను పొడవు: 461.05 కిలోమీటర్లు
132 కేవీ లైను పొడవు: 43.2 కిలోమీటర్లు
మొత్తం లైను పొడవు: 1025.3 కిలోమీటర్లు
రాత్రిళ్లూ పనులు
కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేేసందుకు రాత్రింబవళ్లూ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన 12 బ్లాకుల్లో 1531 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు సాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం 4 వేల మందికి పైగా కార్మికులు నిరంతరం షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు.
అంచనా పెంపు..
సుమారు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.50 వేల కోట్ల దాకా ఖర్చు చేశారు. మూడో టీఎంసీ తరలింపు కోసం అదనంగా మోటార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. తాజా అంచనాల ప్రకారం మూడు టీఎంసీల నీటి లిప్టు కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1.20 లక్షల కోట్ల వరకూ కావచ్చని భాస్తున్నారు.
విజయవాడ వెళ్లి.. జగన్ను స్వయంగా ఆహ్వానించనున్న సీఎం
16న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను సీఎం కేసీఆర్ స్వయంగా ఆహ్వానించనున్నారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఈ నెల 21న ప్రారంభించాలని నిర్ణయించారు’ అంటూ విడుదల చేసిన ప్రకటనలోనే జగన్కు ఆహ్వానం విషయాన్ని కూడా తెలిపింది. ఇలా ఆహ్వానించడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావం పెరిగి.. భవిష్యత్తులో గోదావరి, కృష్ణా జలాల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. శుక్రవారం నుంచి సీఎం వారం రోజులపాటు వరుస కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఆ రోజు ఉదయం హైదరాబాద్లో ‘యాదగిరి’ సమాచార కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అదేరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. 15న జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. 16న ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లాలనుకున్నా, సాంకేతిక కారణాలతో వెళ్లలేకపోయారు. దీంతో ఈ పర్యటనలో ప్రధానిని కలుసుకోనున్నారు. అనంతరం 17న కేసీఆర్ విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శిష్య సన్యాస స్వీకార, పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొననున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. విజయవాడ పర్యటన ముగిసిన తర్వాత 18న కేసీఆర్ మహారాష్ట్ర వెళ్లి సీఎం దేవేంద్ర ఫడణవీ్సను కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నారు.
విద్యుత్తూ సిద్ధం
రూ.2890 కోట్లతో పనులు చేశాం
ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసినట్టు ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ప్రకటించారు. రూ.2,890 కోట్ల వ్యయంతో విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 15 డెడికేటెడ్ సబ్ ేస్టషన్లు (కాళేశ్వరానికే ప్రత్యేకం) నిర్మించామని, వివిధ కేటగిరీల్లో 80 పంపులు బిగించామని చెప్పారు. గతంలో కేవలం 30 మెగావాట్ల విద్యుత్ పంపులు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉందని, కానీ సముద్రమట్టానికి 618 మీటర్లకు పైగా ఎత్తుకు నీటిని పంపింగ్ చేసి, తెలంగాణ బీళ్లకు నదుల నీటిని మళ్లించే బృహత్కార్యంలోవిద్యుత్తు సంస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయని.. ప్రభాకర్రావు చెప్పారు.
గోదావరి నుంచి 2 టీఎంసీల నీటిని ఎత్తి జలాశయాలకు తరలించడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేసినట్లు వివరించారు. ఈ ఏడాది నికరంగా 4,700 మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి తగ్గట్లు ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఏడాది నుంచి మూడు టీఎంసీల నీరు ఎత్తిపోయాలని నిర్ణయించినందున మరో 2,160 మెగావాట్లు అదనంగా అవసరం అవుతుందన్నారు. దీనికోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు 7,152 మెగావాట్ల విద్యుత్తు అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.